21, ఏప్రిల్ 2020, మంగళవారం

పిల్లవాడి సందేహం

*ఒక పిల్లవాడి కి సందేహం వచ్చి, గురువు గారిని ”దేవుడు మనం పెట్టిన నైవేద్యం తింటాడా, తింటే పెట్టిన పదార్థం ఎందుకు అయిపోలేదు...?” అని  ప్రశ్నించాడు .... గురువు గారు ఏం సమాధానం ఇవ్వకుండా, పాఠాలు చెప్పసాగారు*.

 *ఆరోజు పాఠం*
 “ _ఓం పూర్ణమద: పూర్ణమిదం 
పూర్ణాత్ పూర్ణముదచ్యతే 
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే” అనే శ్లోకం._ 

*పాఠం చెప్పడం పూర్తయిన  తరువాత, అందరినీ పుస్తకం చూసి శ్లోకాన్ని నోటికి నేర్చుకొమ్మని చెప్పారు గురువు గారు. కొద్దిసేపటి    తరువాత, నైవేద్యం గూర్చి ప్రశ్నించిన శిష్యుడి దగ్గరకు వెళ్ళి "నేర్చుకున్నావా...?" అని అడిగారు. "నేర్చుకున్నాను" అని వెంటనే అప్పచెప్పాడు శిష్యుడు. శ్లోకం సరిగ్గానే చెప్పినప్పటికీ, గురువు గారు తల అడ్డంగా ఆడించారు.* 

*దానికి ప్రతిగా శిష్యుడు, "కావాలంటే పుస్తకం చూడండి..!" అని గురువు గారికి పుస్తకం తెరచి చూపించాడు.* 

*"శ్లోకం పుస్తకం లోనే ఉందిగా... నీకు శ్లోకం ఎలా వచ్చింది...?" అని అడిగారు గురువు గారు.* 

*శిష్యుడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. గురువు గారే మళ్ళీ ఇలా అన్నారు*

*"పుస్తకంలో ఉండే శ్లోకం స్థూల స్థితి లో ఉంది... నువ్వు చదివినప్పుడు నీ బుర్ర లోకి అది సూక్ష్మ స్తితిలో ప్రవేశించింది. ఆదే స్థితి లో నీ మనస్సులో ఉంది. అంతే కాదు, నువ్వు చదివి నేర్చుకోవడం వల్ల పుస్తకంలో స్థూల స్థితిలో ఉన్న శ్లోకానికి ఎటువంటి తరుగూ జరగలేదు. అదే విధంగా విశ్వమంతా వ్యాప్తి అయి పూర్ణంగా ఉన్న పరమాత్ముడు నైవేద్యాన్ని సూక్ష్మస్థితిలో గ్రహించి, స్థూలరూపంలో ఎటువంటి నష్టం లేకుండా చేస్తాడు. దాన్నే మనం ప్రసాదంగా తీసుకుంటున్నాం...!" అని వివరణ చేశారు.*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి