సాధకుడు సదాశయం కలవాడు అయితేనే చాలదు. సాధనాక్రమం, దానికి ఉపకరణాలుగా ఉండే సాధనసంపత్తీ అంతా కూడా ఉదాత్తంగా ఉండాలి. మురికి గిన్నెలూ తెడ్లూ వాడుతూ, తినటాకికి పనికివచ్చే వంట చేయలేం కదా? అవధూతల స్థాయి మహానుభావులతో పోలికలు తెచ్చుకోకండి. ఎంతకాలం 'నేను' అనే భావనతో ఈ లోకంలో తిరుగుతూ ఉంటామో అంతకాలమూ సాధకులమే. ఈ ప్రకృతి యొక్క మాయకు లోబడ్డ వాళ్ళమే! ఆహారమే అవసరం లేని అవధూతకు గిన్నెలూ అక్కరలేదు వంటా అక్కర లేదు. అది వేరే స్థితి.
ఇలా కూర్చుని ప్రణవాన్ని ధ్యానం చేసుకోవాలి. దాన్ని బ్రహ్మబీజం అంటారు. అది ముల్లోకాల్నీ పవిత్రం చేసే పరమమంత్రం.
ప్రణవం అంటే ఓంకారం. ఓ మిత్యేకాక్షరం బ్రహ్మ అని చెబుతారు. ఓంకారం పరబ్రహ్మానికి ఒక సంకేతంగా చెప్పుకుంటాం. గీతాశాస్త్రం కూడా ఇదే చెబుతోంది. ఈ ఓంకారంలో అ-ఉ-మ అనే మూడు బీజాలు సంపుటిగా ఉన్నాయి. ఓంకారం గురించి ఎంతైనా చెప…
మనస్సుకు తనకు దొరికింది, ఎటువంటి ఆలంబనం అనే విచక్షణ ఏమీ ఉండదు. విచక్షణ ఉండేది బుధ్ధికి. అందుచేత బుధ్ధిని సారధి, మనస్సుని దానిచేతిలో కళ్ళెం అన్నాం. ఒకడి బుధ్ధి, భగవద్విషయాలు ఊతమిస్తే మనస్సు వాటిని పట్టుకుంటుంది. మరొకడి బుధ్ధి, డబ్బు వ్యామోహమో లేదా స్త్రీవ్యామోహమో అనే ఊతం ఇస్తే, వాడి మనస్సు దాన్నే పట్టుకుంటుంది. అందు చేత సాథకులు భగవంతుడికి సంబంధించిన విషయాలు పట్టుకునేనా మనస్సు చేత అభ్యాసం చేయించాలి.
ఇలా చక్కగా పధ్ధతిగా ధ్యానం కొనసాగిస్తే మేలు జరుగుతుంది. లోకాన్ని నిత్యం త్రిగుణాలు కదా మనకి ఎఱుక పరచేదీ? ఇంక విషయాల నుండి మనస్సు విరమించు కుంది కాబట్టి, ఈ త్రిగుణాల వల్ల కలిగే వికారాలు ఏవీ మనస్సుకు సోకనే సోకవు.
సత్వమూ, రజస్సూ, తమస్సు అనే మూడు గుణాలనీ త్రిగుణాలు అని కలేసి చెప్తారు. సత్వం అనేది ప్రశాంత స్థితి అనుకోండి. రజస్సు వలన నేను ఇది చెయ్యాలీ, అది చెయ్యాలీ, నాకు ఇది కావాలీ, అది కావాలీ అనే కోరికలు ఏర్పడుతాయి, క్రియాకలాపం చేయించే స్థితి రాజసికం అన్నమాట. తమస్సు అంటే అహంకారం, సోమరితనం, సుఖలాలస, హింసాప్రవృత్తి వంటి దుర్గుణాల తత్త్వం అన్నమాట. ఈ త్రిగుణాలు మన నిత్య జీవితంలో ప్రతి వస్తువులోనూ, ప్రతిభావన లోనూ దర్శిస్తూనే ఉంటాం. అసలు మనం ప్రపంచాన్ని ఈ త్రిగుణాలనే రంగుల్లో తప్ప వేరుగా చూడనే చూడలేం అన్న మాట. మనం ఏది పొందుతున్నా, దేన్ని భావిస్తున్నా దానికి కారణం త్రిగుణాలే కాని అన్యం కావు.
ఇలా ధారణ చేసిన వాడికి త్రిగుణాల మురికి వదిలిపోయి మనస్సు నిర్మలం అవుతుంది. నిర్మలచిత్తం సాధించిన వాడు హాయిగా విష్ణుపదం చేరుకుంటాడు.
మనస్సు ప్రాపంచిక విషయాలలో పడి తిరుగుతున్నంత కాలం ఈ త్రిగుణాలు దానికి క్షణక్షణం రకరకాల దృశ్యాల్ని చూపిస్తూనే, ఆకర్షిస్తూనే ఉంటాయి. రకరకాల అనుభవాల్ని ఈ త్రిగుణాలు అందిస్తూ, అవి మనస్సును తమ పెంపుడు కుక్కలాగా తమ చుట్టూ తిప్పుకుంటూనే ఉంటాయి.
కాని మనస్సు భగవంతుడికి సంబంధించిన వస్తు, విషయ భావనలను పట్టుకుని కూర్చుం దనుకోండి? అప్పుడు ఆ మనస్సుకి తదితరం అయిన పబయటి ప్రపంచం మీద ఆసక్తి తగ్గిపోతుంది. అభ్యాసం ధృఢం ఐతే అటువంటి ఆసక్తి చచ్చిపోతుంది కూడా.
ప్రపంచం అంటే ప్రకృతికి, దూరం ఐపోయిన వాడి పరిస్థితి ఏమిటి? వాడి మనస్సు మూడు గుణాల తాలూకూ మురికినీ వదిలించుకుంది కదా? మురికి వదిలిన అద్దంలో బొమ్మ స్పష్టంగా ఉంటుంది కదా? ఇప్పుడు ఆ మనస్సు తాను బాగా అభ్యాసం చేసి అనుసంధానం చేసుకున్న భగవత్తత్త్వం మాత్రమే తెలిసి ఉంటుంది. కాబట్టి అది ఆ భగవత్తత్త్వం లోనే లీనం ఐపోతుంది. అలా మనోలయం ఐపోవటమే విష్ణుపదం చేరుకోవటం. విష్ణువు అంటే సృష్టికి ముందే ఉన్న యదార్థ తత్త్వం. సృష్టినుండి విడివడిన తరువాత మనోలయం ఐపోయిన జీవుడు తానే ఆ యదార్థతత్త్వంగా మిగిలిపోతాడు. అదే కైవల్యం, అంటే మోక్షం.
ధారణ అనేది బాగా కుదురు కున్నాక ఈ ప్రకృతి మాయ వలన కలిగిన 'నేను' అనే భావన పోయి, కేవలం జీవుడిగా 'నేను' అనేది మాత్రం బీజరూపంగా మిగులుతుంది . ఈ స్థితిలో వాడు పరమసుఖ స్వరూపమైన సర్వాంతర్యామి యొక్క సత్తా మాత్రం విషయంగా అనందిస్తూ ఉంటాడు. ఈ స్థితికి చేరుకున్న వాడినే యోగి అంటాం.
మోక్షం సాధించే విధానాన్ని మరింత విపులీకరిస్తున్నారు. మనస్సు లయం ఐపోయినప్పుడు తొలుత ప్రకృతినుండి విడిగా ఐపోతాడు. కాని జీవుడిగా మిగిలే ఉంటాడు. ఈ స్థితిలో వాడికి ప్రపంచంతో ఏవిధమైన సాంగత్యం ఉండదు. వాడు కేవలం భగవత్తత్త్వంతో మాత్రం సంబంధం కలిగి ఉంటాడు. ప్రకృతిలో సాంగత్యంతో ఉండటమే దుఃఖం. భగవత్తత్త్వంతో సాంగత్యం పరమసుఖం. ఈ స్థితిలో ఉన్నవాడు యోగి అనిపించుకుంటాడు. ఈ మాటకు అర్థం భగవంతుడితో కూడి ఉన్నవాడు అని.
ఈ సర్వాంతర్యామి పట్ల భక్తి భావన సుధృఢమై నిలవాలి. క్రమంగా బీజ రూపమైన 'నేను' అనేది కూడా యోగాగ్నిలో దగ్ధం ఐపోతుంది. ఇలా దగ్ధబీజ స్థితిని పొందటమే మోక్షం.
ఇలా, క్రమంగా ఇలా యోగం సిథ్థించిన వాడు జీవుడిగా తన ఉనికిని కూడా విసర్జిస్తాడు. వేయించిన విత్తనం మొలకెత్తదు కదా? అలా బీజస్వరూపంగా ఉన్న 'జీవుణ్ణి' అనే భావనకూడా నశించిపోయాక మిగిలేది కేవలం భగవత్తత్త్వం మాత్రమే. పూర్తిగా సృష్టి నుంచి బయటికి వచ్చి అనంతమైన విష్ణుతత్త్వంలో లీనం ఐపోయా డన్నమాట. ఇంక జీవుడే లేనప్పుడు పునర్జన్మ అంటూ ఉండదుక?
ఇదంతా చదువుతే శుకయోగి సాధారణ సాధకుడి స్థాయి నుంచి, ఒక వ్యక్తి కైవల్యం సాధించే దాకా చెప్పారని తెలుస్తోంది. నిజానికి, ఎవరికైన ఇదంతా ఒక జన్మలో పూర్తిచేయటం సాధ్యమా అన్న సంశయం తప్పకుండా వస్తుంది. నిజమే, దానికి ఏళ్ళూ పూళ్ళే కాదు, జన్మలకు జన్మలే పట్ట వచ్చును. కాని భయం లేదు. ఒక జన్మలో పూర్తి కాగలిగినంత యోగసాధన పూర్తి అవుతుంది. వచ్చే జన్మలో అది కొనసాగుతుంది. ఈ మాట భగవద్గీతల్లో శ్రీకృష్ణపరమాత్మ నిష్కర్ష చేసాడు. ఇది గుర్తు పెట్టుకోవలసిన విషయం.