🔔 అనగనగా... 🔔
మంచి సావాసం.....
ఒక రోజు సాయంత్రం చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది. ఆ బస్సు ఒక అడవి గుండా ఘాట్ రోడ్డు పై ప్రయాణిస్తుండగా అకస్మత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం ప్రారంభమైంది. ప్రయాణికులందరు చూస్తుండగానే ఒక పిడుగుపాటు వల్ల బస్సుకు 50 అడుగుల దూరంలో ఒక చెట్టు పడిపోయింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపివేశాడు. ఆ చెట్టు మరో ప్రక్కకు ఉన్న లోయ వైపు విరిగిపడడం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు.
కొద్దిసేపటి తరువాత మళ్లి బస్సు బయలుదేరింది. ప్రయాణికులలో భయం ప్రారంభమైంది. ప్రయాణికులందరు ఊపిరి బిగపట్టుకుని కూర్చున్నారు. ఆ బస్సు రెండు కిలోమీటర్లు వెళ్లిందో లేదో మరో పిడుగు బస్సుకు 40 అడుగుల దూరంలోని చెట్టుకు కొట్టింది. డ్రైవర్ చాకచక్యంతో మళ్లి బస్సును ఆపివేశాడు.
ఇలా మూడు సార్లు జరిగింది. మూడోసారి పిడుగు 30అడుగుల దగ్గరలో పడింది. ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరుకుంది. అరుపులు, ఏడుపులు ప్రారంభమయ్యాయి.
అప్పుడు అందులోంచి ఒక పెద్దమనిషి లేచి ఇలా అన్నాడు... "చూడండీ... మనందరిలో ఈ రోజు ‘పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న ఒక వ్యక్తి ఎవరో ఉన్నారు'. అతని కర్మ మనకు చుట్టుకుని మనందరం కూడా అతనితో పాటు చావవలసి వస్తుంది. నేను చేప్పేది జాగ్రత్తగా వినండి... ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు క్రిందికి దిగి, అదిగో... ఎదురుగా ఉన్న ఆ చెట్టును ముట్టుకుని మళ్లి బస్సులోకి వచ్చి కూర్చోండి. మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి మరణిస్తాడు. మిగిలిన వాళ్లం క్షేమంగా వెళ్లవచ్చు. ఒక్కరి కోసం అందరు చస్తారో... అందరి కోసం ఒక్కరు చస్తారో... ఆలోచించుకోండీ...” అన్నాడు.
అప్పుడు ప్రయాణికులు అందరూ ఒక్కొక్కరుగా వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని రావడానికి మొదలుపెట్టారు. మొదట ఆ పెద్దమనిషే మనుసులో చాలా భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకున్నాడు. ఏమీ జరగలేదు. అతడు ఊపిరి పీల్చుకుని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు. అలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని వచ్చి కూర్చోసాగారు. చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు. ఇక మరణించేది అతడే... అని అందరూ అనుకున్నారు. చాలా మంది అతని వైపు అసహ్యంతో కోపంతో చూడసాగారు. కొందరు జాలి పడుతూ చూడసాగారు. అతను కూడా భయపడుతూ బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికి నిరాకరించాడు.
కాని... బస్సులోని ప్రయాణికులందరు ”నీవల్ల మేమందరం మరణించాలా... వీల్లేదంటూ బస్సు నుంచి బలవంతంగా క్రిందికి నెట్టారు. చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్లి చెట్టును ముట్టుకున్నాడు. వెంటనే పెద్ద మెరుపులతో పిడుగు వచ్చింది, తరువాత భయంకరమైన శబ్దం వచ్చింది. కాని పిడుగు వచ్చి పడింది ఆ చివరి వ్యక్తిపై కాదు... బస్సుపైన. అవును... బస్సుపై పిడుగు పడి అందులోని వున్న ప్రయాణికులందరూ మరణించారు. నిజానికి ఈ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండడం వల్లనే ఇంత వరకు ఆ బస్సుకు ప్రమాదం జరగలేదు. ఇతని పుణ్యఫలం, దీర్ఘాయుస్సు మిగిలిన వారి అందరిని కాపాడింది.
*అందుకే... మన పూర్వీకులు చెప్పేవారు... ఎల్లప్పుడూ మంచివారి తోనే సావాసం చేయమని. మంచివారితో సావాసం చేయడం వల్ల వారి వారి చెడు కర్మ ఫలాల తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది అని.