23, జూన్ 2024, ఆదివారం

పెళ్లిలో ఏడడుగులు...బ్రహ్మముడి అర్ధం..!!

ఓం ఐం హ్రీం శ్రీ శ్రీ మాత్రే నమః..!!🙏🙏
పెళ్లిలో ఏడడుగులు...
బ్రహ్మముడి అర్ధం..!!

పెళ్లంటే... రెండు మనసుల కలయిక, 
నూరేళ్ల సాన్నిహిత్యం.
వైవాహిక జీవితంలో ప్రమాణాలు కట్టుబడి ఉంటే 
ఆ సంసారం స్వర్గం. 
ప్రమాణాలను అతిక్రమిస్తే ఆ సంసారం నరకం. 

మానవజీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం వివాహం. 
ఆ సందర్భంలో వధూవరులతో చేయించే 
ప్రతి కార్యక్రమానికి ప్రాధాన్యత ఉంది.

జీవితంలో ఒకరితో ఒకరిని ఎక్కువకాలం కలిపి ఉంచేది భార్యాభర్తల బంధం. 
ఆ బంధం పటిష్టంగా ఉండటానికి పెద్దలు కొన్ని మంత్రాలను నిర్దేశించారు. 
వాటినే లౌకికంగా పెళ్లినాటి ప్రమాణాలని చెబుతారు.
ఆప్రమాణాలను త్రికరణశుద్ధిగా ఆచరించిన దంపతుల సంసారం మూడుపువ్వులు, ఆరుకాయలుగా వర్థిల్లుతుంది.

ఇక ఇద్దరు వ్యక్తులు, రెండు కుటుంబాలను 
ఒకటిగా చేసేదే వివాహ బంధం.
హిందూ సంప్రదాయంలో జరిగే ప్రతి క్రతువుకూ 
ఓ ప్రత్యేకత ఉంది. 

కన్యాదానం పూర్తయిన తర్వాత ముహూర్తానికి జీలకర్ర-బెల్లం తలపై పెట్టించి, 
ఆ తర్వాత మాంగల్యధారణ చేయిస్తారు. 
ఇది పూర్తయిన తర్వాత వధూవరులకు కొంగుముడి కలిపి బ్రహ్మముడి వేస్తారు. 
వధువు చిటికెన వేలును పట్టుకుని వరుడు అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఏడు అడుగులు నడవడాన్ని ‘సప్తపది’ అంటారు. 

దీనికి విశేష ప్రాధాన్యత ఉంది. 
భార్యాభర్తలు అత్యంత స్నేహంతో కలిసిపోయి, పరస్పరం గౌరవించుకుంటూ, 
అన్యోన్యంగా, ఆదర్శవంతంగా జీవించాలనేదే సప్తపదిలోని అంతరార్థం.

అందుకే పెద్దలు వివాహబంధాన్ని ఏడడుగుల బంధం అంటారు. 
ఇందులో వేసే ప్రతీ అడుగుకీ ఒక్కో అర్థం ఉంది.

మొదటి అడుగు:..!!
ఏకం ఇషే విష్ణుః త్వా అన్వేతు’                       
ఆ విష్ణువు మనిద్దరినీ ఒక్కటిగా చేయుగాక!

రెండో అడుగు:..!!
ద్వే వూర్జే విష్ణుః త్వా అన్వేతు’
ఇద్దరికీ శక్తి లభించేలా చేయుగాక!

మూడో అడుగు..!!
త్రీణి వ్రతాయ విష్ణుః త్వా అన్వేతు’
వివాహ వ్రతసిద్ధి కోసం విష్ణువు అనుగ్రహం లభించుగాక!

నాలుగో అడుగు:..!!
చత్వారి మయోభవాయ విష్ణుః త్వా అన్వేతు’
మనకు ఆనందాన్ని విష్ణువు కల్గించుగాక!

అయిదో అడుగు:..!!
‘పంచ పశుభ్యో విష్ణుః త్వా అన్వేతు’
మనకు పశుసంపదను విష్ణువు కల్గించుగాక!

ఆరో అడుగు:..!!
షడృతుభ్యో విష్ణుః త్వా అన్వేతు’
ఆరు రుతువులు మనకు సుఖమిచ్చుగాక!

ఏడో అడుగు:..!!
సప్తభ్యో హోతాభ్యో విష్ణుః త్వా అన్వేతు’
గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణకు విష్ణువు అనుగ్రహించుగాక!

ఓ అర్ధాంగీ ఏడడుగులతో నువ్వు నా ప్రాణసఖివి అయ్యావు. 
ఎల్లప్పుడూ నువ్వు నా స్నేహాన్ని వీడవద్దు. 
ప్రేమగా ఉందాం. 
మంచి మనసుతో జీవిద్దాం. 
మన ఇద్దరం సమానమైన ఆలోచనలతో మెలగుదాం’ అంటాడు వరుడు.

అప్పుడు వధువు ‘ఓ ప్రాణ సఖుడా! నువ్వెప్పుడూ పొరపాటు చేయకుండా ఉండు. 
నేనూ ఏ పొరపాటు చేయక నీవెంటే ఉంటాను. నువ్వు ఆకాశమైతే నేను భూమి.
నువ్వు శుక్రమైతే నేను శోణితాన్ని.
నువ్వు మనసైతే నేను మాట.
నేను సామవేదమైతే నువ్వు నన్ను అనుసరించే ఋత్వికుడివి.
మనిద్దరిలో వ్యత్యాసం లేదు. 
కష్ట సుఖాలలో ఒకరికొకరం తోడూ నీడగా కలిసి ఉందాం’ అంటుంది.

‘ఓ గుణవతీ! మన వంశాభివృద్ధికి, 
మనకు ఉత్తమస్థితి కలగడానికి, 
మంచి బలం, ధైర్యం, ప్రజ్ఞావంతులై వంశ హితాన్ని రక్షించగల, న్యాయమార్గం అనుసరించే 
ఉత్తమ సంతానాన్ని ప్రసాదించు’ అని 
పురుషుడు చెబుతాడు.

భార్య చిటికిన వేలును భర్త చిటికిన వేలుతో పట్టుకోమని ‘బ్రహ్మ ముడి’ వేస్తారు. 
భార్యభర్తలు ఇద్థరు ఒకరిని ఒకరు విడిచి ఉండకూడదు. 
ప్రయాణమైనా, పుణ్యక్షేత్రమైనా, మోక్షమైనా, అరణ్యవాసమైనా భార్యా భర్తలు కలిసే ఉండాలి. 

భార్యాభర్తలుగా మారటం అంటే ఇద్థరి శరీరాలు 
ఒకే ప్రాణంగా మనుగడ సాగించటం. 
భార్యాభర్తల మధ్య ఎన్ని మనస్పర్ధలు ఉన్నా వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న ముడి, 
అంటే వీళ్ళ ఇద్థరి మధ్య ఇంకొకరు దూరటానికి 
వీలు లేకుండా ఉండాలని, 
అలా ఉండిపోవాలని గోరంత అవకాశం దొరికినా 
ఆ అదును చూసుకొని మూడో వ్యక్తి చొరబడతాడని- ఎటువంటి పరిస్థితులలో ఐనా భర్తతోనే జీవితం అనుకోవాలని  వథువుకి,     
భార్యే సర్వస్వంగా అనుకోవాలని వరుడీకి చెప్పి బ్రహ్మ ముడి వేస్తారు -" 
అంటే ఇరువురి శరీరాలను ఒకే ప్రాణంగా మార్చటం అన్నమాట!

ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..!!🙏
ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..!!🙏
🍒🍓🌸🌻🍌🪻🪷🌺🍅🍎

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి