12, జనవరి 2021, మంగళవారం

తాపత్రయ విమోచనం గురించి చక్కని కథ.

 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷


అయిదేళ్ళ వయసులో ఒక కుర్రవాడు హిమాలయ పర్వత శిఖరాగ్రాల మీద ఉండే బౌద్ధారామాలకి విద్యాభ్యాసం కోసం పంపబడ్డాడు. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా సంవత్సరాల తరబడి సిద్ధాంత మూలసార జ్ఞానాన్ని సముపార్జించుకున్న తరువాత, ఆ జ్ఞానాన్ని ప్రజలకు పంచమన్న గురువు ఆదేశంతో, ఆ భిక్షువు పర్వతశ్రేణుల మధ్య నుంచి దిగి మొట్ట మొదటిసారి నాగరిక ప్రపంచంలో అడుగుపెట్టాడు.


 అప్పటి వరకూ ఆశ్రమం దాటి బయటకురాని ఆ పద్దెనిమిదేళ్ళ యువకుడికి అంతా కొత్తగా ఉంది. బౌద్ధసాధువులకు సాంప్రదాయకమైన భిక్షాటన నాశ్రయించి, ఒక ఇంటి ముందు నిలబడి మధుకరము అర్థించాడు. ఇంటి యజమాని యువ సాధువు కాళ్ళు కడిగి సగౌరవంగా లోపలికి ఆహ్వానిoచి, భిక్ష వేయమని కూతుర్ని ఆదేశించాడు.


ఒక పదహారేళ్ళమ్మాయి లోపల్నుంచి ఏడు రోజులకి సరిపడా బియ్యాన్ని తీసుకొచ్చి అతడి జోలెలో నింపింది. ఆమెని చూసి యువకుడు చకితుడయ్యాడు. అప్పటివరకూ పురుషులనే తప్ప ‘స్త్రీ’ని చూడలేదతడు. ఆమె గుండెల కేసి చూపించి తామిద్దరి మధ్య తేడా గురించి గృహస్థుని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకి తండ్రికి కోపం రాలేదు. ఎదుట ఉన్నది మనుష్యుల మధ్యకి తొలిసారి వచ్చిన సన్యాసి అని తెలుసు.


స్త్రీ పురుషుల తేడా గురించి చెపుతూ, ‘...వివాహం జరిగి తల్లి అయిన తరువాత పాలు ఇచ్చి పిల్లల్ని పోషించవలసిన బాధ్యత స్త్రీకి ఉన్నది కాబట్టి ప్రకృతి ఆమెకు ఆ విధమైన అవయవాలను సమకూర్చింది’ అని వివరణ ఇచ్చాడు.


సుదీర్ఘమైన ఆలోచనలో పడిన యువకుడు, ఆ రోజుకు సరిపడా బియ్యం మాత్రం ఉంచుకొని, మిగతా ఆరు రోజుల దినుసులు వెనక్కి ఇచ్చి తిరిగి తన గురువు దగ్గరకు చేరుకున్నాడు. ‘అలా ఎందుకు చేశావ’ని అడిగాడు గురువు. 


“తర్వాతెప్పుడో దశాబ్ద కాలం తరువాత ప్రపంచంలోకి అడుగిడబోయే బిడ్డ కోసం తగు ఏర్పాట్లన్నీ ప్రకృతి ముందే సమకూర్చినప్పుడు, రేపటి ఆహారం గురించి ఈ రోజు తాపత్రయపడటం ఎంత నిష్ప్రయోజనమో నాకు అర్థమయింది స్వామీ..!” అన్నాడా భిక్షువు. 


“బౌద్ధం గురించీ, బంధం గురించీ సంపూర్ణమయిన జ్ఞానం నీకు లభించింది నాయనా" అంటూ శిష్యుణ్ణి కౌగిలించుకొని అభినందించాడు బుద్ధ భగవానుడు .

ఏమని ప్రార్థించాలి

 ప్రార్థన (ప్ర+ఆర్థన) అంటే చక్కగా వేడుకోవడం. ఈ వేడుకోలుకు అర్థం, పరమార్థం అనేవి రెండూ బొమ్మ బొరుసు లాంటివి. మనిషి ఈ ప్రపంచంలో సుఖంగా ఉండాలనుకోవడం, అందుకు తగ్గ వెసులుబాటుకోసం ప్రయత్నించడం సహజం. ధర్మంగా ధనం సంపాదించుకోవచ్చు. ధర్మబద్ధంగా కోరికలు తీర్చుకోవచ్చు.


ధనం ఇంధనంలా దహించుకుపోతుంది. కోరికలు గుర్రాల్లా పరుగులు తీస్తూనే ఉంటాయి. ఈ విషయం ప్రతి మనిషికీ ఏదో ఒక రోజు అర్థం అవుతుంది. అప్పుడు ఈ భౌతికమైన సుఖాలు కేవలం తాత్కాలికమేనన్న ఎరుక కలుగుతుంది. వీటికి మించిన శాశ్వతానందం ఎక్కడుందన్న జిజ్ఞాస మొదలవుతుంది. గుండెలోతుల్లో నుంచి గంగాజలంలా పైకి లేచిన ఆ ఆకాంక్ష, ఒక ఆర్తనాదమై ఒక ఆవేదనారూపమై చెలరేగుతుంది. అదే ప్రార్థన!


దూడను ప్రసవించగానే గోమాత తన బిడ్డను ఆప్యాయంగా నాలుకతో నిమిరినట్టు, భగవంతుడు భక్తులను లాలించి, పాలిస్తాడు. పరమ ప్రేమస్వరూపుడైన భగవంతుడికి తన సంతానంపై ఉన్న అనంతమైన ప్రేమానురాగాలను వరాల రూపంలో అందిస్తాడు.


సాత్వికులైన ధ్రువుడు, ప్రహ్లాదుడు శ్రీమహావిష్ణువు సాక్షాత్కరించగానే భౌతికమైన వాంఛలు తొలగి భగవంతుడి పాదసేవనం అనే పరమానందం కావాలని అడిగారు. తపస్సు చేసిన హిరణ్యకశిపుడు, రావణుడు అధికారం, ఆధిపత్యం కోరారు! కోరి తమ వినాశాన్ని వారే కొని తెచ్చుకున్నారు. పరుల సుఖాల్నే మన సుఖమని, విశ్వశ్రేయమే మనకూ శ్రేయోదాయకమని, బుద్ధిగా జీవించాలని త్రికరణ శుద్ధితో ఆ పరమాత్మకు చేసే విన్నపమే ప్రార్థన! అదే మన ఆధ్యాత్మిక ప్రగతికి తొలి సోపానం.


భగవంతుణ్ని సేవించే భక్తులను నాలుగు తెగలుగా చెబుతారు- ఆర్తి, అర్ధార్థి, జిజ్ఞాసు, జ్ఞాని. ఈ నలుగురిలో ఆయనకు చాలా దగ్గరివాడు జ్ఞాని అని గీతాచార్యుడు సెలవిచ్చాడు.


భగవంతుడు అన్నీ ఇచ్చాడు. అయినా, ఏదో తెలియని ఆరాటం గుండెల్లో ఆరడి చేస్తూనే ఉన్నది. కారణం ఏదో ఒకమూల స్వార్థపిశాచం పీడించడం వల్లే అలా మనసు అల్లాడుతూ ఉంటుంది. మనం చేయవలసినదేదో శక్తివంచన లేకుండా, సక్రమంగా చేస్తే చాలు... తక్కినదంతా ఆయనే చూసుకుంటాడు. ఆ మాట కూడా గీతాచార్యుడు చాలా స్పష్టంగానే చెప్పాడు. అయినా అజ్ఞానం, అహంకారం, మమకారం... ఈ మూడూ ఏకమై మనల్ని పెడదారికి ఈడుస్తూ ఉంటాయి.


అలా జరగకుండా మనసును నిర్మలంగా ఉంచమని, ప్రపంచాన్ని ప్రేమగా చూడగల హృదయ సౌందర్యాన్ని ప్రసాదించమని, పరోపకారం వైపు బుద్ధిని మరల్చమని, మాటలకందని మౌనభాషలో భగవంతుణ్ని వేడుకోవడమే నిజమైన ప్రార్థన. ఆ ప్రార్థన సన్నని వెలుగై మన జీవితాలను గమ్యంవైపు నడిపిస్తుంది. ‘సర్వేజనాః సుఖినో భవంతు’ అనే ఒక గొప్ప ప్రార్థనను వేదం ప్రపంచానికి అందించింది. అదే మన జీవితాలకో దారిదీపమై వెలుగు చూపాలని అర్థించాలి. అదే మనం చేయవలసిన ప్రార్థన!

- ఉప్పు రాఘవేంద్రరావు

విదుర నీతి

 జీవితం ప్రశాంతంగా గడపాలని ప్రతి వ్యక్తీ కోరుకుంటాడు. సమాజంలో శాంతి ఉన్నప్పుడే ప్రజలు సుఖంగా ఉంటారు. ఇందుకు నీతినియమాలు తోడ్పడతాయి. నీతి తప్పిన సమాజంలో అశాంతి నెలకొంటుంది. మన సాహిత్యం లోక క్షేమాన్ని కోరుకొంటుంది. భారతీయ ధర్మశాస్త్రాలు మానవుడు ఎలా జీవిస్తే సమాజానికి మేలు జరుగుతుందో చెబుతాయి. ఈ గ్రంథాలను రచించినవారు మహర్షులే! యుగధర్మాలను బట్టి ఈ ధర్మశాస్త్రాలు విభిన్న మార్గాలను మనకు సూచిస్తాయి. కృతయుగంలో మనుధర్మ శాస్త్రం, త్రేతాయుగంలో గౌతమస్మృతి, ద్వాపరంలో శంఖలిఖితుల స్మృతి- ప్రామాణికాలు. కలియుగంలో పారాశర్య స్మృతిని పాటించాలని రుషులు భావించారు. మారుతున్న కాలాన్ని బట్టి కొన్ని నీతుల గురించి అభిప్రాయాలూ మారుతున్నాయి. కొన్ని మాత్రం యుగాలు మారినా మారవు.

ఎప్పటికీ సమాజానికి ఉపయోగపడే నీతులు చెప్పినవారిలో విదురుడు ముఖ్యుడు. ఒక దాసికి,  వ్యాసుడికి జన్మించిన విదురుడు ధృతరాష్ట్రుడికి తోడుగా ఉంటూ హితోక్తులు చెబుతూ, పాండవుల మేలు కోరుతూ ఉండే కృష్ణభక్తుడు.

రాయబారానికి శ్రీకృష్ణుడు వెళ్ళినప్పుడు ఎవరి ఇంట్లోనూ భోజనానికి అంగీకరించడు. విదురుడి ఆహ్వానాన్ని మన్నించి అతడి ఇంటికి మాత్రం వెళ్ళాడు. విదురుడు భక్తితో స్వయంగా తానే కృష్ణుడికి ఆహారం తినిపించాడు. భక్తి పారవశ్యంతో ఒడలు మరచి, అరటిపండు తొక్క ఒలిచి దాన్నే కృష్ణుడి నోటికి అందించి, లోపలి పదార్థాన్ని పారవేశాడు! విదురుడి నిర్మల భక్తికి ఇది నిదర్శనం.

సంజయుడు పాండవుల వద్దకు రాయబారానికి వెళ్ళివచ్చిన తరవాత, ధృతరాష్ట్రుడివి అన్నీ అధర్మ కృత్యాలేనని అధిక్షేపించాడు. అప్పటి నుంచి మానసిక క్షోభతో ధృతరాష్ట్రుడికి నిద్రపట్టలేదు. విదురుణ్ని పిలిచి మంచి మాటలతో తన మనసుకు ప్రశాంతత కలగజేయమన్నాడు. విదురుడు ముందుగా నిద్ర పట్టనివాళ్లెవరో చెబుతాడు. ‘బలవంతుడితో విరోధం పెట్టుకున్న వాడికి, సంపద పోగొట్టుకున్న వాడికి, కాముకుడికి, దొంగకు నిద్ర ఉండదు’ అని అంటాడు. విదురుడి నీతులకు ఏ యుగంలోనైనా విలువ అలాగే చెక్కుచెదరకుండా ఉంటుంది!

జ్ఞానులు ఎలా ప్రవర్తిస్తారో, మూర్ఖులు ఎలా ఉంటారో విదుర నీతులనుబట్టి చక్కగా తెలుసుకోవచ్చు. తనకు అందనిదాన్ని గురించి ఆరాటపడనివాడు, పోయినదాన్ని గురించి విచారించనివాడు, ఆపదలో సైతం వివేకం కోల్పోనివాడే జ్ఞాని. అధికమైన సంపద, విద్య ఉన్నప్పటికీ ఉత్తముడు వినయంగానే ఉంటాడు.

మూర్ఖుడు వెంటనే చేయవలసిన పనిని అడుగడుగునా అనుమానిస్తూ, ఆలస్యంగా చేస్తాడు. అతడు తాను తప్పుచేసి, ఎదుటివాణ్ని నిందిస్తాడు. ధనం లేకుండా కోరికలు పెంచుకోవడం, సమర్థత లేకపోయినా ఇతరులపై మండిపడటమనే ఈ రెండూ మనిషిని కృశింపజేస్తాయి.

‘మధుర పదార్థం నలుగురికీ పంచకుండా ఒక్కడే భుజించకూడదు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒక్కడే కూర్చుని బయటపడే ఉపాయం ఆలోచించకూడదు... అందరూ నిద్రపోతుంటే ఒక్కడే మెలకువతో ఉండకూడదు. మానవుడికి ఆరు సుఖాలున్నాయి. అవి ఆరోగ్యం, ధన సంపాదన, ప్రియురాలైన భార్య, చెప్పినట్లు వినే పుత్రుడు, సంపాదనకు పనికివచ్చే విద్య!’ అని విదురుడు విశదీకరించాడు.


సమాజానికి ఎప్పటికీ పనికొచ్చే విధంగా ఉపదేశించిన విదురనీతులు అజరామరాలు. అందుకే భారతానికి ‘ధర్మశాస్త్రం’ అనే పేరు వచ్చింది!

🌸నెగిటివ్ అంశాన్ని,పాజిటివ్ గా స్వీకరిస్తే!!!

 ఒక వ్యక్తి రాత్రి పడుకునే ముందు తన రీడింగ్ టేబుల్ తల పెట్టి అలా కూర్చుని నిద్ర పోతున్నాడు. అప్పుడు అతని భార్య అతన్ని లేపి మంచం మీద పడుకోమని చెప్పాలని వచ్చింది. అప్పుడు ఆమె దృష్టి అతని చేతిలో పెన్ను పై  అతని ముందు రైటింగ్ పాడ్ పై పడింది. దానిమీద ఏదో రాసి ఉంది. ఆమె తన భర్తను కదిలించకుండా ఆయన రాసినదాన్ని చదవసాగింది.. నిశ్శబ్దంగా!


నెగిటివ్ ఆలోచనలు!!!


"గత ఏడాది నాకు సర్జరీ జరిగి గాల్ బ్లాడర్ తొలగించారు. మూడు నెలలు మంచం మీదే గడపాల్సి వచ్చింది...


   "ఈ ఏడాదే నాకు 60 ఏళ్లు నిండి నాకెంతో ప్రియమైన ఉద్యోగం రిటైర్ అయ్యాను. నేను ముప్ఫై ఏళ్లు ఈ కంపెనీలో రాత్రనక పగలనక కష్టపడి పని చేసి కంపెనీ అభివృద్ధి లో పాలు పంచుకున్నాను. ఆ కంపెనీ తో నాకెంతో అనుబంధం ఉంది.దానితో ఋణం తీరిపోయింది 


"ఈ ఏడాదే మా నాన్నగారి మరణం నా జీవితంలో విషాదం నింపింది.


"ఈ ఏడాదే నా కొడుకు కారు ప్రమాదం వల్ల మంచం పట్టి మెడికల్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు. ఎన్నాళ్లుగానో నాకు సేవ చేసిన నా ప్రియమైన కారు ఎందుకూ పనికిరాకుండా పోయింది.


"దేవుడా! ఈ ఏడాదిలో ఎన్ని భయంకరమైన అనుభవాలు ఇచ్చావు!!"


చివరి వరకూ చదివిన ఆమె నిశ్శబ్దంగా ఆ రైటింగ్ పాడ్ ను తీసుకుని బయటకు నడిచింది.


కాసేపటి తర్వాత ఆమె వచ్చి పాడ్ ను అక్కడే పెట్టి వెళ్ళిపోయింది.


ఆయనకి మెలుకువ వచ్చింది.  తన చేతిలో పెన్ను, టేబుల్ మీద రైటింగ్ పాడ్ చూసుకున్నాడు. దానిమీద రాసి ఉన్నది చదివాడు.


పాజిటివ్ గా ఆలోచిస్తే!!!


"గత ఏడాది నాకు గాల్ బ్లాడర్ సర్జరీ జరిగింది. చాలా కాలంగా నన్ను వేధించిన కడుపు నొప్పికి ఎట్టకేలకు ముగింపు పలక గలిగాను.


"ఈ ఏడాది లోనే నాకు అరవై ఏళ్లు నిండాయి.  సంపూర్ణ ఆరోగ్యం తో నేను రిటైర్ అయినందుకు ఆనందంగా ఉంది. ఇక నా పూర్తి సమయాన్ని ప్రశాంతంగా నా ఆనందం కోసం, నా కుటుంబం కోసం గడుపుతాను.


"ఈ ఏడాదిలోనే మా నాన్నగారు 95 ఏళ్ళ వయసులో ఎవరితోనూ చేయించుకోకుండానే ఎలాంటి ఇబ్బందీ లేకుండానే  ప్రశాంతంగా సహజమరణం చెందారు.


"ఈ ఏడాదిలోనే  నా కొడుకుకు కొత్త జీవితం వచ్చది. కారు పోతే పోయింది గానీ నా కొడుకు ఎలాంటి సమస్యా లేకుండా పెద్ద గండం నుండి బయట పడ్డాడు.


"హే భగవాన్! ఈ ఏడాది ఎంత సంతోషాన్ని మిగిల్చావు!! ఈ ఏడాదిని ఎంత అద్భుతంగా ముగించావు!!!"


అంతా చదివిన ఆయన చుట్టూ ఓసారి చూసాడు. కర్టెన్ వెనకాల తన భార్య నీడను గమనించి జరిగింది అర్థం చేసుకున్నాడు. తన భార్యను మనసులోనే అభినందించుకున్నాడు....


ఎంతో ప్రోత్సాహ భరితంగా ఉన్న ఆ వాక్యాలు చదివిన ఆయన భగవంతునికి తన కృతజ్ఞతలు తెలుపుకుంటూ సంతృప్తిగా నిట్టూర్చాడు.

☀️☀️☀️

మంచి,చెడు అనేవి మన ఆలోచనా సరళే.మన ఆలోచనా సరళి సరిగా ఉంటే మనం చేసే పని సరైన దారిలో నడుస్తుంది. ఫలితం అనుకూలంగా ఉంటుంది. ఫలితం అనుకూలంగా ఉంటే మనసుకు హాయిగా అనిపిస్తుంది. అదే కదా ఆనందమయమైన జీవితం?

☀️☀️☀️

🌸 మార్పు - సహజస్థితి..🌸

    🌸 మార్పు అనేది నిత్యం జరుగుతూనే ఉంటుంది... మనం మన సహజస్థితి అంటే ఎలాంటి వత్తిడి లేకుండా ఉండటం... ఏ వత్తిడి లేనప్పుడు ఎలా ఉంటామో అది మనం... మార్పు జరుగుతున్నప్పుడు ఘర్షణ అనేది వస్తుంది... దానిని అధిగమించాలి అంటే మార్పును అంగీకరించటం మినహా ఇంకో దారి లేదు... దానికి మనం ఏ పెరు పెట్టుకున్న మార్పు మనల్ని తనలో కలిపేసుకుంటుంది దానికి ఏలాటి భావం లేకుండా..

దీనికి ఓ ఉపమానం చిన్న కద...


   🌸 మన ఇంటిలోకి ఓ దొంగ వచ్చాడు మనం ఏమి చేస్తాం సహజంగా ఆపటానికి చూస్తాం కుదరకపోతే ఏమి చేస్తున్నాడో చూస్తాం... ఆ దొంగ గాలి లేదా ఊపిరి అయితే... అంగీకరించాల్సిందే.. వేరే దారి ఉండదు కాబట్టి... మార్పు అలాంటిదే అని అనుకుంటే పరిస్థితిని దానికి తగినట్లుగా మార్చుకుంటాం.. అంటే ఇక్కడ మన శక్తికి మించి అయితే లోబడ్డట్లు అనుకుంటే ఇప్పటి వరకు మనం జీవించం...  బలవంతపు మార్పు మనిషిని సహజత్వం నుంచి దూరంగా తీసుకువెళుతుంది... అదే అంతే సహజంగా ఆహ్వానిస్తే జీవితం పూల బాట అవుతుంది... తేడా ఏమిటి అంటే అ0గీకరించటం మాత్రమే... ఏదైతే మనసా వాచా కర్మణా మనం మార్పును ఆహ్వానిస్తామో ఆక్కడ ఉండేది ఆనందం.. ఎప్పుడైతే ప్రశ్నిస్తామో అక్కడ ఘర్షణ మొదలు... ఘర్షణ వచ్చింది అంటే అక్కడ బావావేశాలు మొదలు... సహజమైన శాంతి స్తితి మనలో ఉండదు..


   🌸 సహజమైన స్తితిలో ఎదుగుదల ఉండదు కాబట్టి మార్పు అవసరం... ఎదుగుదల కోసం ప్రయాణం మార్పు కోసం వెధకడమే.. రెండు సరైనవే కానీ సరికాదు.. ఇక్కడ ప్రతి ఒక్కరూ దోలాయన స్తితిలోకి వెళుతుంటారు... మన15 వ సంవత్సరం నుంచి 45 సంవత్సరం వరకు  ఎదుగుదల కోసం మన ప్రయాణం అనివార్యంగా ఉంటుంది... ఇక్కడ ఘర్షణతో కలిసి ప్రయాణం... 45 నుంచి మన పరుగు ఆపుతాం కారణం అప్పటికే ఘర్షణ అంటే విసుగు వచ్చి... అక్కడ నుంచి సహజస్థితి కోసం పరుగులు... ఇలా మనకు మనం (ఆత్మ) ఎదుగుదల కోసం చిన్నప్పటినుంచి ప్రయాణం మొదలు పెట్టటం చాలా అవసరం... మన పిల్లలకు చిన్ననాటినుంచే ధ్యాన ప్రయాణం అనివార్యం కూడా... మనం ఏమి చేసినా ఇలా ఇప్పుడు ఉన్నస్తితి వారికి అందించగలిగితే ఇప్పటి జెనరేషన్ నుండి రెండో జెనరేషన్ శాంతి సౌఖ్యలతో విలసిల్లుతు0ది... దారి ఏదైనా గమ్యం కొరకే... గమ్యం ఏదైనా ఉన్నత స్తితి కొరకే.. ప్రయాణం ఏదైనా సహజ స్తితి కొరకే...


Thank you...🌸🌸🌸

20, ఆగస్టు 2020, గురువారం

ఉపాయాలతో మనస్సును స్వాధీనంలోకి ఎలా తెచ్చుకోవాలి

ఉపాయాలతో మనస్సును స్వాధీనంలోకి ఎలా తెచ్చుకోవాలి - అభ్యాసయోగం అంటే?
ఉన్నత విషయాలను ధ్యానించటానికి ప్రయత్నించినప్పుడు మనస్సు దానిపై ఏకాగ్రంగానిలవదు. అల్పవిషయాల వైపుకే పరుగులు తీస్తుంది. ఒక పండితుడు భగవద్గీతకు అంతరార్థాన్ని వ్రాస్తూ ఒక కథను ఇలా చెప్పాడు. - 
సృష్టికి ముందు నిరాకార నిర్గుణ పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. ఆయనకు మాయ అనే భార్య ఉన్నది. వారికొక కుమారుడు. అతడే మనస్సు. అయితే కుమారుడికి అంతా తల్లి పోలికే. తండ్రి అంటేనే దరి చేరడు. ఎప్పుడూ తల్లికొంగు పట్టుకొని తల్లి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆ మనస్సనే వాడికి ఇద్దరు భార్యలు. ఒకరు ప్రవృత్తి, మరొకరు నివృత్తి. వీడికెప్పుడూ ప్రవృత్తి అంటేనే ఇష్టం. నివృత్తి అంటే అస్సలు గిట్టదు. ప్రాపంచిక వ్యామోహాలే ప్రవృత్తి. అవి పట్టక పరమాత్మపై అనురాగమే నివృత్తి. ప్రవృత్తి సంతానం అసురులు (ఆసురీగుణాలు). నివృత్తి సంతానం దేవతలు (దైవీగుణాలు) ఈ రెండూ శరీరమనే ఈ కురుక్షేత్రంలో పోరాటం చేస్తూ ఉంటాయి. 
  మనస్సుకెప్పుడూ ప్రవృత్తి యందే (ప్రాపంచిక విషయభోగాల యందే) పక్షపాతం. దానిని మెల్లమెల్లగా 'శనైః శనైః రుపరమేత్' అన్నట్లుగ మెల్లమెల్లగా మచ్చిక చేసుకోవాలి తప్ప మరొక ఉపాయం లేదు. మనస్సే బంధానికైనా మోక్షానికైనా కారణం అవుతుంది. ("మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః") కనుక తెలివిగా మనస్సును మచ్చిక చేసుకోవాలి. దానికే అభ్యాసయోగం. అనేక ఉపాయాలతో మనస్సును స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. తొందర పనికిరాదు. ఎలా?
  నీ ఇంట్లో దొంగగొడ్డు ఉన్నది. ఏమాత్రం ఏమారినా చాలు కట్లుతెంచుకొని పరుగెడుతుంది. ఇతరుల పొలాల్లో పడిమేస్తుంది. దానిని ఎలా దారికి తేవాలి? మూర్ఖులు దానిని కొడుతూ బలవంతంగా తెచ్చి, గొలుసులతో స్తంభానికి కట్టివేసి కసిదీరా కొడతారు. తప్పించుకొని పోవటానికి వీలులేక వెళ్ళకుండా ఉంటుందేగాని, వీలు కుదిరితే మళ్ళీ చిక్కకుండా పారిపోతుంది. ఎప్పుడో సమయం వస్తుంది. అప్పుడది తప్పించుకొని పోతుంది, దొంగగడ్డి మేస్తుంది. ఎప్పటికీ కనిపించకుండా తప్పించుకొని ఎక్కడకో పోతుంది. ఇక ఎప్పటికీ దాని గతి అంతే.
అదే తెలివిగల వాళ్ళు ఏంచేస్తారు? అది పొలాల్లో మేసే మేతకన్న ఎక్కువ నాణ్యమైన, రుచికరమైన, దానికి ఇష్టమైన మేతను సప్లై చేస్తారు. ఇక ఫరవాలేదని ఊరుకోకుండా అలా దానికి మంచి మేత ఇస్తూ ఉండాల్సిందే. ఈ మేతను తినటం దానికి అలవాటై పోతుంది. అప్పుడు దానిని వదిలినా అది ఇక దొంగ తిండికోసం వెళ్ళదు. హాయిగా ఇంట్లోనే మేస్తుంది; దారికి వస్తుంది. 
మన మనస్సు కూడా దొంగ గొడ్డు లాంటిదే. దానికి వైరాగ్యమనే కళ్ళెం బిగించి అభ్యాసమనే మంచిమేత వేయాలి. ఇందులో రుచి మరిగిందా ఇక నెట్టినా ఎక్కడికీ పోదు. రుచి మరిగేంత వరకే కష్టం. కనుక అభ్యాసం చేస్తూనే ఉండాలి.
అభ్యాసంలో ఉన్న శక్తి చాలా గొప్పది. దేవాలయంలో క్రొత్తగా వచ్చిన పూజారి మంత్రం చదువుతూ, హారతి ఇస్తూ గంట మ్రోగించాలి. గంట మ్రోగిందా! హారతి తిరగదు. హారతి తిరిగిందా! గంట ఆగిపోతుంది. ఆయన క్రొత్త పూజారిగదా! ఈ రెంటి విషయంలో జాగ్రత్తపడితే మంత్రం తడబడుతుంది లేదా ఆగిపోతుంది. ఐతే నిరాశపడకుండా అభ్యాసం చేస్తే హారతి తిరుగుతుంది, గంట మ్రోగుతుంది, మంత్రం కొనసాగుతుంది. ఎవరెంత దక్షిణ వేస్తున్నారో కూడా గమనిస్తూ ఉంటాడు. ఇదే అభ్యాసం మహిమ. 
  అభ్యాసం వల్లనే సర్కస్ లో ఏనుగు సైకిలు త్రొక్కుతుంది. అమ్మాయిలు తీగమీద నడుస్తారు. అభ్యాసం వల్లనే సముద్రాన్ని ఈదవచ్చు. ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కవచ్చు. అభ్యాసం వల్లనే జీవుడు దేవుడవుతాడు. అందుకే 'సాధనమున పనులు సమకూరు ధరలోన' అన్నారు.
  కనుక ఎవరైతే మనోబుద్ధులను భగవంతుని యందే నిలిపి, ఏకాగ్రచిత్తంతో ధ్యానించలేరో, సమాధిలో నిలువలేరో అట్టి వారు అభ్యాసం చేయాలి. మనోబుద్ధులు భగవంతుని యందు నిలవటానికి వీలుగా మనోబుద్ధులకు ట్రైనింగ్ ఇవ్వాలి. అభ్యాసం చేయాలి.

*నీ జీవిత సహచరి ఎవరు?*

*నీ జీవిత సహచరి ఎవరు?*
అమ్మనా?
నాన్ననా?
భార్యనా?
భర్తనా?
కొడుకా?
కూతురా?
స్నేహితులా?
బందువులా?
లేదు.ఎవరూ కాదు.!
నీ నిజమైన సహచరి ఎవరో తెలుసా?
*నీ శరీరమే!* 
ఒక్కసారి నీ శరీరం స్పందించడం ఆగిపోతే ఎవ్వరూ నీ దగ్గర ఉండరు గాక ఉండరు!!
నువ్వు అవునన్నా?కాదన్నా?ఇది కఠిక నిజం.!!!
నీవూ నీ శరీరం మాత్రమే జననం నుండి మరణం దాకా కలిసి ఉంటారు.
నీవేదైతే నీ శరీరం కొరకు భాద్యతగా ఏ పనైతే చేస్తావో అదే నీకు తప్పక తిరిగి వస్తుంది.
నీవెంత ఎక్కువ శ్రద్ధగా శరిరాన్ని బాగా చూసుకుంటావో.,నీ శరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా బాగా చూసుకుంటుంది.
నీవేమి తినాలి?
నీవేమి చేయాలి?
ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి?
నీవెంత విశ్రాంతి తీసుకోవాలి?
అనేవి మాత్రమే నీ శరీరం స్పందనను నిర్ణయిస్తాయి.
గుర్తించుకో.!
నీ శరీరమొక్కటే నీవు జీవిస్తున్న చిరునామా.!!
నీ శరీరమే నీ ఆస్థి.,సంపద.
వేరే ఏదీ కూడా దీనికి తులతూగదు.
నీ శరీరం నీ భాద్యత.!
ఎందుకంటే?
నీవే నిజమైన సహచరివి.!
కనుక జాగ్రత్తగా ఉండు.
నీ గురించి నువ్వు జాగ్రత్త తీసుకో.
డబ్బు వస్తుంది.వెళ్తుంది.
బందువులు.,స్నేహితులు శాశ్వతం కాదు.
గుర్తుంచుకో.!
నీ శరీరానికి ఎవరూ సహాయం చేయలేరు.
ఒక్క నీవు తప్ప.!
ఊపిరితిత్తులకు- ప్రాణాయామం.
మనసుకు-ద్యానము.
శరీరానికి-యోగా.
గుండెకు-నడక.
ప్రేగులకు-మంచి ఆహారం.
ఆత్మకు-మంచి ఆలోచనలు.
ప్రపంచానికి-మంచి పనులు.
*శ్రీశ్రీ.రవిశంకర్.*
*సుప్రసిద్ధ ఆద్యాత్మికవేత్త.* 
ఆంగ్లరచనకు తెలుగు అనువాదం.యధావిధిగా.
బొడ్డు సురేందర్.
ఇందూరు.