24, ఫిబ్రవరి 2024, శనివారం

గరుడ పురాణం

"గరుడ పురాణం" అనగానే చాలామంది అదేదో అశుభ పురాణమని, భయంకరమైనది అని భావిస్తారు.. 

గరుడ పురాణము అనగానే చాలామంది ,అదేదో అశుభపురాణ మనియు , ఎవరో చనిపోయినప్పుడే తప్ప వట్టి రోజులలో చదువకూడదనియు ఒక దురభిప్రాయము లోకములో నాటుకు పోయినది .కాని అది సరియైనది కాదు . ఇది,విష్ణు మహత్యమును దెలుపు వైష్ణవ పురాణము .నారద పురాణములో దీనిని గురించి – ” మరీచే శృణు వచ్మద్య పురాణం గారుడం శుభమ్. గరుడా యాబ్ర వీత్ పృష్నో భగవాన్ గరుడాసనః” అని శుభమును గలిగించు పురాణముగా చెప్ప బడినది .
గారుడ కల్పములో విశ్వాండము నుండి గరుడుడు జన్మించుటను ,అతని చరిత్రమును ,పురస్కరించుకుని ఈ గరుడ పురాణము వెలసేనని మత్స్య పురాణములో చెప్పబడినది . అగ్ని పురాణము వలెననే ఈ పురాణము గూడా విజ్ఞాన సర్వస్వమని చెప్పవచ్చును. దీనిలో అనేక విషయములున్నవి .
అన్ని పురాణములలో వలెనె దీనిలోను బ్రహ్మాదుల సృష్టి ,వారు చేసిన ప్రతి సృష్టి ,వంశములు , మన్వంతరములు , వంశములలోని ప్రసిద్దులైన రాజుల కధలు ఉన్నవి .యుగ ధర్మములు ,పూజావిదానములు విష్ణుని దశావతారములు ,అనేక ధర్మములు, ఆయుర్వేదము, చికిత్సా విధానములు , చంద శ్శాస్త్ర ప్రశంశ ,వ్యాకరణము ,గీతా సారాంశము మొదలగునవి అన్నియు వర్ణింప బడినవి.

ఈ పురాణములో పూర్వ ఖండము ఉత్తర ఖండము అని యున్నవి .ఉత్తర ఖండములోని ప్రధమ భాగము ప్రేత కల్పము అని చెప్పబడును .చనిపోయిన వారి ఆత్మ శాంతి కై చేయదగిన కార్యము లన్నియు అందులో చెప్పబడినవి. కావున దానిని ఆ పది రోజులలో చదువుట ఆచారముగా నున్నది. తక్కిన భాగములన్నియు పవిత్రములో అన్ని పురాణముల వలెనె ఎప్పుడు కావలసిన అప్పుడు ఇంటిలో చదువుకొనుటకు వీలుగా నున్నవే.
నైమిశారణ్యము లోని శౌనకాది మునీంద్రులు సూతు నడుగగా ,వారి కతడీ గరుడ పురాణము నిట్లు వివరించెను.

గరుడ పురాణం:
⚜🔱⚜🔱⚜

గరుడుని పుట్టుక:
 ఒక కల్పాంత ప్రళయ కాలములో లోకములన్నియు నశించి జగమంతయు ఏకార్ణవ మై పోయెను. స్థావరములు లేవు. జంగమములు లేవు, సూర్య చంద్రులు లేరు, జగత్తులు లేవు , బ్రహ్మ లేదు అంతయు సర్వ శూన్యముగా నుండెను. అంతటను మహాంధకారము వ్యాపించి యుండెను . ఆ చీకటి కావల ఏదో ఒక మహా జ్యోతి . అది స్వయం ప్రకాశకమై వెలుగు చుండెను. అదియే సర్వ జగత్కారణ మైన మహస్సు. ఆ జ్యోతి స్వరూపుడైన భగవానుని సంకల్ప బలము వలన ఆ మహా జల నిధిలో ఒక పెద్ద అండము (గ్రుడ్డు ) తేలు చుండెను . అది కొంత కాలమునకు చితికి రెండు చెక్కలయ్యెను. ఒకటి నేలగాను ,మరొకటి ఆకాశముగాను అయ్యెను.ఆ యండము నుండి గరుత్మంతుని రూపములో నారాయణుడు ఆవిర్భవించెను. అతని నాభి కమలము నుండి బ్రహ్మ ఉదయించెను . అతడేమి చేయవలెనో తోచక దిక్కులు చూచు చుండగా “తప తప “అను మాటలు విన వచ్చెను . అంతట నతడు చుట్టును చూడగా తనను సృష్టించిన గరుడ రూపుడైన నారాయణుడు కనిపించెను. ఆ మూర్తినే అతడు ధ్యానించుచు కొన్ని వేల యేండ్లు తపము చేసి మానసిక శక్తిని సంపాదించెను. నారాయణుడతనిని సృష్టి చేయుమని యాదేశించెను .
బ్రహ్మ మనస్సంకల్పముతో ముందు సనక సనంద నాదులను సృజించాగా వారు సంసారము నందు వైరాగ్యము గలవారై తపమునకు బోయిరి. అప్పుడు ఈ చరాచర సృష్టి చేయుట తన యొక్కని వల్ల సాధ్యము గాదని , దక్ష మరీచి కశ్యపాది ప్రజా పతులను సృజించి , వారి వారికి తగిన భార్యలను గూడ సృష్టించి యిచ్చి , మీరు సృష్టిని వ్యాపింప జేయుడని యాదేశించెను. వారు తమ తండ్రి యాజ్ఞను శిరసావహించి సృష్టిని కొన సాగించిరి.
కశ్యప పుత్రుడైన గరుత్మంతుడు
 కశ్యపునికి చాలామంది భార్యలు గలరు. వారిలో వినత ,కద్రువ అనే వారిద్దరు. వారిద్దరిలో కద్రువకు సవతి మచ్చరము హెచ్చు. కాని పతిని సేవించుటలో మాత్రము ఎవరి కెవరును తీసిపోరు. వినత సాదు స్వభావము కలది. ఆమె ,గరుడ రూపుడైన శ్రీమన్నారాయణుడే సృష్టికి ఆది పురుషుడని విని అటువంటి కుమారుడు కావలెనని శ్రీహరిని గురించి తపము చేసెను. నారాయణు డామెను అనుగ్రహించి నీ గర్భమున గరుడుడుగా జన్మింతునని వరమిచ్చెను.ఆమె సంతోష భరితురాలయ్యేను .
ఆమె కొన్నాళ్ళకు గర్భవతి అయ్యెను. ఒకనాడు కద్రువ , వినతలు క్షీర సాగర తీరమునకు విహారమునకు బోయిరి. అక్కడ ఉచ్చైశ్శ్రవము కనబడెను. దానిని చూచి కద్రువ “గుఱ్ఱము శరీర మంతయు తెలుపే కాని తోక మాత్రము నున్న ” దనెను. వినత ” అదేమి ? అట్లనుచున్నావు ? తోక కూడా తెల్లగా నున్నది కదా ?” అనెను. కద్రువ ,”కాదు నలుపే నల్లగా నున్నచో నీవు నాకు దాస్యము చేయవలెను .తెల్లగా నున్నచో నేను నీకు దాస్యము చేసెదను ” అనెను .వినత ” అయినచో పోయి చూతము రమ్మ “నెను. కద్రువ ” ఇప్పటికే సంధ్యా కాలమైనది .మన భర్తకు కావలసినవి చూడవద్దా? నడువుము.
రేపు ప్రొద్దున చూత ” మని చేయిపట్టి తీసుకొని పోయెను. ఆ రాత్రి తన కుమారులైన వాసుకి తక్షక ప్రముఖులైన సర్ప రాజులను పిలిచి ,”మీలో నల్లనివారు రేపు ఉదయమున ఉచ్చైశ్శ్రవము తోక పట్టుకుని వ్రేలాడుచు నల్లగా కనబడునట్లు చేయు ” డనెను . “విషయమే” మని వారడుగగా ,జరిగినది చెప్పెను. వారిది అన్యాయమనిరి. ఆపని మేము చేయము అనిరి .ఆమె వారిని సర్పయాగాములో నశింపు చసేను.

వినతకు దాస్యములో నుండగానే గరుత్మంతుడు జన్మించెను. అతనిని గూడ కద్రువ దాసీ కొడుకు గానే చూచెడిది .తన పిల్లలను (సర్పములను ) వీపు మీద నెక్కించుకుని
 త్రిప్పి తీసుకుని రమ్మని యాజ్ఞా పించెడిది గరుడుడు వారి నెక్కించుకుని సూర్య మండలము దాకా ఎగిరెడి వాడు. వారు ఆ సూర్యుని వేడికి కమిలి పోయెడి వారు. ఆ రోజున పాపము గరుడునికి ఉపవాసమే .సవతి తల్లి కోపముతో తిండి పెట్టెడిది కాదు.
ఒకనాడు గరుడుడు తన తల్లి దగ్గరకు పోయి,” మనకీ దురవస్థయే” మని ప్రశ్నించెను. ఆమె సర్వమును వినిపించెను. గరుడుడు కద్రువ దగ్గరకు వెళ్లి ” ఏమిచ్చినచో నీవు నా
 తల్లిని దాస్య విముక్తి రాలీని చేసేద ” నని యడిగెను. ఆమె ” దేవలోకము నుండి అమృత భాండమును దెచ్చి ఇచ్చినచో నీ తల్లిని విడుతు ” ననెను.
గరుడుడు తండ్రియగు కశ్యపు నొద్దకు వెళ్లి , తన తల్లి దాస్యమును ,దాని విముక్తికి చేయవలసిన కార్యమును చెప్పి ,ఇన్నాళ్ళును సరియైన ఆహారము లేక కృశించి యున్నాను. నాకు కడుపు నిండా భోజనము పెట్టు మని యడిగెను.
కశ్యపుడు సముద్ర తీరమున విస్తరించు చున్న మ్లేచ్చ జాతిని భక్షింపు మనగా గరుడు డట్లు చేసెను. వారిలో చెడిన బ్రాహ్మణుడు ఒకడుండి గరుడని గొంతులో అడ్డుపడెను. వారికొరకు ఆమ్లేచ్చులను విడిచి పుచ్చెను. కశ్యపుడు గజ కచ్చపములు పోరాడుచున్నవి, వానిని దినుమనగా ఆ రెండింటిని రెండు కాళ్ళతో పట్టుకుని పోవుచు ఎక్కడ పెట్టుకుని తినవలెనని వెదుకుచు జంబూ వృక్షపు కొమ్మపై వ్రాలెను. అది విరిగెను. దానిపై వాల ఖిల్యాది మునులు బొటన వ్రేలంత ప్రమాణము గలవారుండి తపము చేసికొను చుండిరి అది తెలిసికొని ఆ కొమ్మను ముక్కుతో పట్టుకుని పదిలముగా మేరు శిఖరముపై దింపి తాను మరొక వైపున గూర్చుండి గజకచ్చపములను భక్షించెను. ఆ తరువాత దేవలోకమునకు వెళ్లి ,అమృత కుంభమును దెచ్చు చుండగా రక్షకులు అడ్డగించిరి .వారిని గెలిచి వచ్చు చుండగా ఇంద్రుడు వచ్చి ఎదిరించి పోరాడెను.కాని గరుడుని గెలువలేక వజ్రాయుధమును ప్రయోగించెను. అది గూడా అతనిని ఏమియు చేయలేక పోయెను. అప్పుడు ఇంద్రుడు గరుడునితో ” దేవతలకు సర్వస్వ మైన యీ యమ్రుతమును పాములకు పోయుట మంచిది కాదు. నీ ప్రయత్నము విరమింపు
” మనెను. దానికి గరుడుడు ” నా తల్లి దాస్య విముక్తి కై ఈ పని చేయుచున్నాను. దీనిని నా సవతి తల్లికి ఇచ్చినచో నా తల్లి విముక్తురాలగును.” అనెను . ” ఐనచో నీవు దీనిని నీ సవతి తల్లికిమ్ము ఆమె ,నీ తల్లికి దాస్య విముక్తి యైనదని చెప్పగానే , అదృశ్య రూపుడనై వచ్చి ఈ యమృత కలశమును గొని పోయెదను .దీనికి నీవంగీకరింపుము” అనెను. గరుడుడు ఒప్పుకొనెను. అమృత భాండమును కద్రువ చేతిలో బెట్టి , ” మా తల్లికి దాస్య విముక్తి కలిగినట్లే కదా !” అనగా ఆమె అవుననెను. వెంటనే ఆమె చేతిలోని అమృత కలశము అదృశ్య మై పోయెను. అనగా ఇంద్రుడపహరించెను.
ఈ విధముగా తల్లికి స్వాతంత్ర్యము కలిగించిన గరుడుడు తల్లి దీవెనలు పొంది తండ్రి దగ్గరకు వెళ్లి విషయము నంతను వివరించెను. ఆయన తన కుమారుని పరాక్రమ విశేషములకు సంతోషించి ,” కుమారా ! ఆది పురుషుడైన శ్రీమన్నారాయణుని గూర్చి తపము చేసి యనుగ్రహము సంపాదింపుము. ధర్మవర్తనుడవై యుండుము. నీకు త్రిలోక ము లందును ఎదురుండదు.” అని చెప్పెను.
తండ్రి హిత భోదను విని గరుడుడు శ్రీ హరిని గూర్చి తీవ్రమైన తపము చేసెను. చాలాకాలము అట్లు చేయ శ్రీనాధుడు ప్రత్యక్షమై “గరుడా ! నీ భక్తికి మెచ్చినాను .నీవు నాకు వాహనమై యుండి నేను చెప్పిన పనులు నిర్వర్తింపు చుండుము.” అని వరమిచ్చి తనకు వాహనముగా జేసికొనెను.
గరుడుని గర్వ భంగము
 ఒకప్పుడు గరుత్మంతునికి ,తాను మహా బలవంతుడనని గర్వము కలిగెను. తాను తక్కువవాడా ? గజ కచ్చపములను చెరియొక కాలితో పట్టుకొని కొన్ని యోజనముల దూరము ఎగురుట ,అంతమంది రక్షకులను గెలిచి దేవలోకమున నున్న అమృతమును దెచ్చుట ,ఇంద్రుని వజ్రాయుధమునకు బెదర కుండుట సామాన్య విషయములా ? అవన్నియు ఎందుకు ? సకల బ్రహ్మాండ భాండములను తన కడుపులో బెట్టుకున్న ఆ శ్రీ మహా విష్ణువును అనాయాసముగా వహించుచు లోకములన్నియు దిరుగుచున్న తన కంటే బలవంతుడీ చతుర్దశ భువనములలో ఇంకెవడున్నాడని గర్వ పడ సాగెను. దానితో అందరిని కొంత చులకనగా జూచుచు ప్రవర్తింప జొచ్చెను. ఇది నారాయణుని దృష్టిలో బడినది .ఇతనికెట్లయినను గర్వ భంగము చేయవలెనని సంకల్పించెను.
ఒకనాడు నారదాది మునులు శ్రీ పతిని దర్శించుటకై వచ్చిరి .విష్ణుమూర్తి వారితో మాటలాడుచు అలవోకగా ప్రక్కనున్న గరుడునిపై చేయి వేసెను. మునులతో మాధవుని సంభాషణ సాగుచుండెను . గరుడునికి విష్ణుమూర్తి చేయి భరించ లేనంత బరువుగా నుండెను. ప్రాణములు కడ బట్టు చుండెను . సంభాషణ ఎంతసేపు సాగినదో కాని గరుడు డీలోపున ప్రాణ వశిష్టు డయ్యెను. ఎప్పటికో మునులు సెలవు దీసుకుని వెళ్ళిరి. శ్రీ హరి అప్పుడా చేయి గరుడుని మీద నుండి తీసెను. గరుడప్పటికే సొమ్మసిల్లి పడిపోయెను.
శ్రీ హరి అతనిని మృదువుగా సృశించెను . గరుడుడా స్పర్శతో తేరుకుని , విష్ణు మూర్తి పాదములపై బడి ,” ఓ మహాపురుషుడా ! నీకన్న సృష్టిలో అధికు లెవ్వరును లేరు ఈ పరమార్ధమును గ్రహింపలేక గర్వాందుడనైన నాకు సరియైన పాటమును చెప్పితివి ,నా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి