18, ఫిబ్రవరి 2024, ఆదివారం

జననమరణములు అంటే ఏమిటి!? - మనిషికి మృత్యుభయం వీడకపోవడానికి కారణం ఏమిటి!?

 జననమరణములు అంటే ఏమిటి!? - మనిషికి మృత్యుభయం వీడకపోవడానికి కారణం ఏమిటి!?

         ✍️ Dr. M. N. చార్య

🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


🪷 మరణానికి మరొక మారుపేరు "మార్పు". మార్పుని మనందరం చాలా సహజంగా స్వీకరిస్తాం. కానీ మరణం అనే పదాన్ని వాడగానే చాలా భయపడిపోతూవుంటాం. మానవునికి జీవించివున్నప్పుడు ఆరు దశలున్నాయి. వీటినే "అవస్థాషట్కము"  అని అంటారు. అవి... 

1. పుట్టుట, 2. ఉండుట, 

3. పెరుగుట, 4. మారుట, 

5. క్షీణించుట, 6. నశించుట. దీనినే భగవద్గీతలో రెండవ అధ్యాయం సాంఖ్యయోగము 13వ శ్లోకంలో నాలుగు అవస్థలుగా చెప్పారు.


✳️ మనిషికి ఎన్ని అవస్థలు కలవు  


శ్లో: 

"దేహినో౬స్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా! 

తథాదేహాంతరప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి!! 


🪷 జీవికి బాల్యము, యౌవనము, వార్ధక్యము, మరియు దేహాంతరప్రాప్తి అను నాలుగు అవస్థలు కలవని. ఇవన్నియూ మార్పులే అని. మనిషి, బాల్యము పోయి, యౌవనము వచ్చినప్పుడు, దుఃఖించుటలేదు, యౌవనముపోయి, వార్ధక్యము వచ్చినప్పుడు దుఃఖించుటలేదు, కానీ వార్ధక్యము పోయి మరణం ఆసన్నమైనప్పుడు మాత్రము దుఃఖపడుతూ, భయం పొందుతూ ఉంటాడు. మనిషి, మనిషిపై అతిగా మమకారం, బంధాన్ని పెంచుకోవటంవల్ల భౌతిక వస్తువులు, సుఖాలపై ప్రీతిని, మోహాన్ని, బంధాన్ని అతిగా పెంచుకోవటంవల్ల తాను ప్రేమిస్తున్నవి, తాను అనుభవిస్తున్నవి, సుఖాన్ని ఇస్తున్నవి ఇక ఉండవేమో అన్న ఆలోచనే మరణంపై భయాన్ని కలుగచేస్తుంది. 


✳️ మృత్యు భయం వీడకపోవటానికి కారణం..! 


🪷 భూమి పుట్టి ఇంతకాలమైనా ఇన్ని మరణాలు చూసినా మనిషికి ఈ మృత్యు భయం వీడకపోవటానికి కారణం ‘మోహం'. మహాభారతంలోని అరణ్యపర్వంలో యక్షుడు, ధర్మరాజుని ప్రపంచంలో అన్నిటినీమించి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటని అడుగుతాడు! అందుకు ధర్మరాజు...  ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ కూడా మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండిపోతాననుకోవటమే ఆశ్చర్యమని చెబుతాడు! 


🪷 మృత్యువును గురించి నచికేతుడు యమధర్మరాజును అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. అది ‘కఠోపనిషత్' గా ప్రసిద్ధి చెందింది. ఇక భగవద్గీతలో కూడా దీన్ని గురించి చెప్పబడింది. దాని ప్రకారం - ఏది అభౌతికమైనది అంటే......, ‘ఆత్మే' అభౌతికమైనది.  దీనికి చావు పుట్టుకలు ఉండవు. ఈ ఆత్మ దేహధారణ చేస్తే ‘జీవాత్మ' అవుతుంది. ‘జీవాత్మ' దేహత్యాగం చేస్తే ‘ఆత్మ'గా మిగిలిపోతుంది. పాంచభౌతికమైన శరీరం మరణించిన తర్వాత భూతత్వం-భూమిలోను,  అగ్నితత్వం-అగ్నిలోను, జలతత్వం-జలములోను,  వాయుతత్వం-వాయువులోను శబ్దతత్వం-ఆకాశంలోను లయమౌతాయి. ఇదీ క్లుప్తంగా గీత చెప్పింది. 


✳️ పుట్టడం గిట్టడం అంటే ఏమిటి..?  


🪷 అసలు పుట్టటం గురించి తెలుసుకుందాం. 


🪷 సాధారణంగా మానవుల దృష్టిలో పుట్టడం అంటే ఇంతకుముందు లేనిది ఏదో రావడం. గిట్టడం అంటే ఇప్పటి వరకు ఉన్నది పోవడం. క్రియలో రెండు వేరు వేరుగా కనపడుతున్నా.. కానీ పుట్టడం అన్నా గిట్టడం అన్నా రెండూ ఒకటే! ఎలా అంటే ఏదైనా ఒక వస్తువు తన పూర్వావస్థ ( అంటే ఇంతకు ముందున్న స్థితి )ని వదిలి ఉత్తరావస్థ ( అంటే ఇప్పటి స్థితిని వదిలి తరువాత స్థితి )ని పొందడాన్నే పుట్టడం అంటారు. గిట్టడం అంటే కూడా అదే అర్ధం వస్తుంది. ఇప్పటి వరకు ఉన్నస్థితిని వదిలి దాని తరువాత స్థితికి వెళ్ళడాన్ని గిట్టడం అంటారు. 


🪷 ఉదాహరణకు..  ఒక విత్తనం తన బీజావస్థని వదిలి వృక్షావస్థకి వస్తే దానినే మనం చెట్టు మొలిచింది అంటున్నాము. అంటే .. దాని పూర్వావస్థ అయిన విత్తనస్థితి నుంచి అది చెట్టు రూపంలోకి వచ్చింది. అంటే విత్తనం "పోయింది" చెట్టు "పుట్టింది". మనం ఆ చెట్టుని కట్టెల రూపంలోకి మార్చాము అనుకోండి ఆ ఉన్నచెట్టు కాస్తా పోయింది దాని నుంచి "కట్టెలు" పుట్టాయి. ఆ కట్టెలనే మనం కాల్చాము అనుకోండి, కట్టెలు పోతాయి దాని నుంచి బొగ్గులు పుడతాయి. ఆ బొగ్గులనే మళ్ళీ కాల్చాము అనుకోండి. ఆ బొగ్గులు పోతాయి అందులోంచి బూడిద పుడుతుంది. అలా భూమిలో నుంచి పుట్టిన చెట్టు బూడిదగా మారి చివరకి మళ్ళీ మట్టిలోనే కలుస్తుంది. ఇలా ఈ భూమి మీద ఏదైనా సరే మట్టిలోనుంచి వచ్చి చివరికి మళ్ళీ మట్టిలో కలవాల్సిందే! విత్తనంపోయి చెట్టుపుట్టింది! చెట్టుపోయి కట్టెలు పుట్టాయి, కట్టెలు పోయి బొగ్గులు పుట్టాయి, బొగ్గులు పోయి బూడిద పుట్టింది, బూడిద తిరిగి మట్టిలోనే కలిసింది.  


✳️ గతం అనేది ఒక మృత వస్తువు 


🪷 ఈ రకంగా పుట్టడం అంటే ఒక వస్తువు తన పూర్వావస్థని వదిలి ఉత్తరావస్థని (అంటే తరువాత స్థితిని) పొందడం. ఇక్కడ అవస్థ అంటే అర్ధం స్థితి అని. అంటే వస్తువు (మెటీరియల్) అదే, కాని దాని రూపం మారింది. ‘గతం' అనేది ఒక సెకండ్ క్రితం వెళ్ళిపోయింది. దాన్ని తిరిగి తీసుకోనిరావటం అంబానీ, బిల్ గేట్స్ ల వల్ల కూడా కాదు. ‘గతం' అనేది ఒక మృత వస్తువు. దానికి ప్రాణంపోసి సజీవురాలిని చేయటం అసంభవం. ఇంతవరకూ జరగలేదు, ఇక ముందర కూడా జరగదు. మరణాన్ని గురించి నిదానంగా ప్రశాంతంగా తెలుసుకోవాలి. దీన్ని గురించి తెలుసుకుందామనే తొందరపాటు ఉండకూడదు.

మృత్యువును అతి సహజంగా, హుందాగా, అంతరంగ గౌరవమర్యాదలతో చేరుకోవాలి. జననం మాదిరిగానే మృత్యువు కూడా అద్భుతమైన విషయం. మృత్యువులో కూడా సృష్టి ఉంది. సృష్టి... ఆది-అంతం లేకుండా నిరంతరం జరుగుతుండే ప్రక్రియే మృత్యువు సృష్టికి ఒక అర్ధాన్నిస్తుంది. 


✳️ గతం నుండి విముక్తే మృత్యువు 


🪷 మళ్ళీ జన్మ ఎత్తటం కావలసినవన్నీ పొందటం మృత్యువుకేమీ సంబంధం లేదు. ఆది, మధ్య, అంతం అనే స్థితులు లేని ఒక మహత్తర సృష్టి మృత్యువు.  అంటే, ఇంకా సులభంగా చెప్పాలంటే మృత్యువు మనల్ని సమీపించిన వేళ మన దగ్గర ఉన్నవన్నీ తొలగించబడుతాయి. అనుబంధాలు, డబ్బు, భార్య, పిల్లలు, దేశం, మూఢనమ్మకాలు, విశ్వాసాలు, గురువులు, శిష్యులు, దేవుళ్ళు నిజానికి వీటన్నిటినీ గురించిన భావాలను మనతో వస్తాయనుకుంటాం కానీ అది అసాధ్యం అవన్నీ మృత్యువు తెంచేస్తుంది. ఒక్క వాక్యంలో చెప్పాలంటే గతం నుండి విముక్తే (Freedom from the Known) మృత్యువు అంటే! 


🪷 అయితే,  ఇంత సహజమైన మృత్యువుని చూసి భయమెందుకంటే...  గతాన్ని మరచి పోవటానికి మనం సిద్ధంగా ఉండం. ఇంత చెబుతున్నా ఎవరైనా తమ మత విశ్వాసాలను మార్చుకుంటారా? గతం నుండి విముక్తి చెందారా? అంటే సమాధానం లేదనే చెప్పాలి. గతం నుండి విముక్తి చెందటమంటే వర్తమానంలో జీవించటం, అట్టివారికి మృత్యు భయం ఉండదు. వారు మృత్యువును, జననం అంత సహజంగా చూస్తారు. భూమి పుట్టిన తర్వాత ఇన్ని మృత్యువులు సంభవించాయి కదా మరి అది మిగిల్చిన సందేశం ఏమిటంటే పూర్తిగా నిరాసక్తతగా ఉండండి (Be Totally Detached) ఎందుకంటే,  మృత్యువు సమీపించినప్పుడు జరిగేది అదే.  చనిపోవటమంటే అన్నిటినీ వదులుకోవటం (To give up everything) మృత్యువు అన్నిటినుంచి మనల్ని తోసివేస్తుంది. ఇవన్నీ క్రోడీకరిస్తే మృత్యువు అంటే,  స్వేచ్ఛగా ఉండటమే అనుక్షణం మనం శ్వాస, నిశ్వాసాల ద్వారా మరణిస్తూనే ఉన్నాం, కొందరు అనుకున్నట్లు పుడుతూ కూడా ఉన్నాం. పునర్జన్మ అంటే ఇదే (So, Living is Dying) ఇలా అనుక్షణం మరణించే మనం మృత్యువుని చూసి భయపడటం అర్ధరహితం.  దీన్ని గురించి ఎవరికి తోచిన విధంగా వారు చెబుతున్నారు. 


✳️ నాకు అన్నీ తెలుసు అనుకుంటే పొరపాటే...


🪷 నాకు అన్నీ తెలుసు అన్న మనిషికి అసలు ఏమీ తెలియదు అనే ఒక నానుడిని మీరు కూడా వినే ఉంటారు. 'నేను భగవదానుభూతిని పొందాను, ఆధ్యాత్మిక వికాసం అంటే ఏమిటో నాకు తెలుసు' - అని ఎవరైనా అంటే దాని అర్ధం,  స్టేషన్ కు వెళ్ళటానికి నాకు దారి తెలుసు సుమా అని, స్టేషన్ ఒక స్థిర ప్రదేశం దీన్ని చేరుకోవటానికి అనేక మార్గాలున్నాయి. ఈ రోజుల్లో ఒక్కక్క మార్గానికి ఒక్కక్క గురువు ఉన్నాడు. నిజానికి వాళ్ళు చెబుతున్న, 'నాకు తెలుసు, నేను చూసాను' అంటే, వాళ్ళు 'ఏదో చూసారు ఆ చూచినదానికి కట్టుబడి ఉన్నారు. వాళ్ళంతా గతంలోనే ఉన్నారు.' 


🪷 గతం,  కాలంలో కరిగిపోతుంది. అది సజీవమైంది. స్టేషన్ లాగా అది స్థిరమైన ప్రదేశం కాదు. మృత వస్తువు అంతకన్నా కాదు. విశ్వాసం నిజం కాకపోవచ్చు, అదే సత్యం కాదు కూడానేమో. కొంతమంది భగవంతుని విశ్వసించవచ్చు, కొంతమంది విశ్వసించక పోవచ్చు. ఎవరి విశ్వాసంలో వారికి ప్రామాణికతలుంటాయి. మన ఆలోచనలకు అనుగుణంగా మనం విశ్వాసాలను ఏర్పరుచుకున్నాం. మరి ఇంతకూ నిజం ఏమిటో ఎలా తెలుస్తుంది? నిజం తెలుసుకోవాలంటే మనసు స్వేచ్ఛగా ఉండాలి. విశ్వాసం, అవిశ్వాసం ఈ రెండింటిలోను దానికి తావులేదు. నిరంతరమూ అన్వేషించటమే సత్యాన్ని తెలుసుకోవటానికి మార్గం ఏదో ఒక మార్గంలో అన్వేషించాలి. ఆ మార్గం తప్పైతే మరో మార్గం! మరణభయాన్ని విశ్లేషించి చూస్తే మరణించేటపుడు పొందవలసిన దేహబాధ పెట్టే భయం కన్న మరణం తరువాత నేను మిగలను అనే విషయం తెచ్చే భయమే ఎక్కువ అని తేలుతుంది. ఇన్ని గ్రహించిన తర్వాత మనిషి ఎదుటి వారి మనస్సును, అంతరాత్మ పరమార్దాన్ని తెలుసుకోగాలుగుతున్నాడా!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి